Amit Shah: జమ్మూ కశ్మీర్ లో వరుస హత్యలు... అజిత్ ధోవల్ తో అమిత్ షా భేటీ

  • తాజాగా బ్యాంకు మేనేజర్ హత్య
  • కాల్చి చంపిన దుండగులు
  • రెండ్రోజుల కిందట స్కూలు టీచర్ ను బలిగొన్న వైనం
  • కశ్మీర్ లోయలో వ్యూహం మార్చిన ఉగ్రవాదులు
Amit Shah meet NSA Ajit Dhoval in Delhi

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉగ్రవాదులు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బ్యాంకు మేనేజర్ ను కడతేర్చారు. ఇటీవలే ఓ స్కూలు టీచర్ ను అంతమొందించారు. ఇప్పటివరకు ఈ విధంగా ఎనిమిది మందిని బలిగొన్నారు. ఈ ఘటనలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. 

ఈ ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస సమావేశాలతో జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. 

దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అంతమొందించే ఉగ్రవాదుల నయా వ్యూహాన్ని అడ్డుకోవడంపైనే ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఇదే అంశంపై రేపు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

More Telugu News