YSRCP: సాయంత్రంలోగా నా స‌స్పెన్ష‌న్‌కు కార‌ణం చెప్పాలి.. లేదంటే న్యాయ‌పోరాటం: కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు

  • వైసీపీని తాను ఒక్క మాట కూడా అన‌లేదన్న కొత్తపల్లి 
  • ఏ త‌ప్పు చేయ‌కుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్న 
  • ర‌ఘురామ‌ను ఎందుకు సస్పెండ్ చేయ‌డం లేదని నిలదీత 
  • నోటీసులు ఇవ్వ‌కుండా స‌స్పెన్ష‌న్ దారుణ‌మ‌న్న కొత్త‌ప‌ల్లి
kottapalli subbarayudu ultimatum to ysrcp

త‌న స‌స్పెన్ష‌న్‌కు కార‌ణ‌మేమిటో చెప్పాల‌ని, లేనిప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానంటూ మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు వైసీపీని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు గురువారం మ‌ధ్యాహ్నం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాను వైసీపీని ఒక్క మాట కూడా అన‌లేద‌న్న కొత్త‌ప‌ల్లి.. తాను ఏ త‌ప్పు చేయ‌కుండానే త‌న‌పై పార్టీ వేటు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎందుకు సస్పెన్ష‌న్ వేటు వేయ‌డం లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. 

త‌న‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా స‌స్పెండ్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. గురువారం సాయంత్రంలోగా త‌న స‌స్పెన్ష‌న్‌కు గ‌ల కార‌ణాల‌ను మీడియాకు విడుద‌ల చేయాల‌ని ఆయ‌న వైసీపీని డిమాండ్ చేశారు. స‌రైన కార‌ణం లేకుండా స‌స్పెండ్ చేస్తే చ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

More Telugu News