Narendra Modi: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన మోదీ, అమిత్ షా!

  • ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం
  • తెలంగాణ సంస్కృతి ప్రపంచ ప్రఖ్యాతి పొందిందన్న మోదీ
  • దేశ ప్రగతి కోసం కట్టుబడింది తెలంగాణ యువత అన్న అమిత్ షా
Modi and Amit Shah greets Telangana people on state formation day

ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఎనిమిదవ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా వీరిరువురూ తెలుగులో శుభాకాంక్షలను తెలియజేయడం విశేషం. 

ట్విట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ.. 'రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను' అని తెలిపారు. 

'దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ... తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు' అని అమిత్ షా ట్వీట్ చేశారు.

More Telugu News