Congress: సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ స‌మ‌న్ల‌పై రేవంత్ రెడ్డి స్పంద‌న

  • నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఈడీ స‌మ‌న్లు
  • నోటీసుల‌ను ఖండిస్తున్నాన‌న్న రేవంత్ రెడ్డి
  • మోదీకి ఇప్ప‌టికీ కాంగ్రెస్ క‌ల‌లోకి వ‌స్తున్న‌ట్టుంది అంటూ సెటైర్‌
revanth reddy condemns ed summons to sonia and rahul gandhi

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీల‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు స‌మ‌న్ల‌లో ఈడీ అధికారులు సోనియా, రాహుల్ గాంధీల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటీసుల‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. 

సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ నోటీసుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 8 ఏళ్ల పాల‌న త‌ర్వాత కూడా ప్ర‌ధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ క‌ల‌లోకి వ‌స్తున్న‌ట్టుందని ఆయ‌న బీజేపీని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుపై న‌మోదైన కేసును 8 ఏళ్లుగా సాగదీస్తున్నారంటూ రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ అణ‌చివేత ధోర‌ణి, కుట్ర‌ల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

More Telugu News