Jammu And Kashmir: పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూత

  • నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీంసింగ్
  • రచయితగా, మానవ హక్కుల నేతగా సుపరిచితుడు
  • యాసిర్ అరాఫత్, సద్దాం హుస్సేన్, ఫిడెల్ కాస్ట్రో వంటి వారితో సన్నిహిత సంబంధాలు
  • కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం
JKNPP supremo Prof Bhim Singh passed away

జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (JKNPP) వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీంసింగ్ జమ్మూకశ్మీర్‌లోని జీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. 

మానవ హక్కుల నేతగా, రచయితగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా సుపరిచితుడైన భీంసింగ్.. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 1982లో జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. జమ్మూకశ్మీర్‌కు 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. పాలస్తీనా నేత అరాఫత్, క్యూబా విప్లవ నేత ఫెడెల్ కాస్ట్రో, ఇరాక్ నేత సద్దాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీతో భీంసింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భీంసింగ్ భార్య, కుమారుడు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు.

More Telugu News