Karnataka: లవర్ కోసం చేసిన ఖర్చును లెక్కరాసి.. ఆ మొత్తాన్ని వసూలు చేయాలని కోరుతూ లేఖ రాసి యువకుడి ఆత్మహత్య

  • కర్ణాటకలోని చిక్కమగళూరులో ఘటన
  • తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్న చేతన్
  • ఆమె సంతోషం కోసం రూ. 4.50 లక్షలు ఖర్చు చేశానంటూ సూసైడ్ నోట్
  • ఆ మొత్తాన్ని వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని విజ్ఞప్తి
Man Committed Suicide after Lover Rejected to marry him

వారిద్దరూ ప్రేమికులు. ఆమె సంతోషం కోసం విపరీతంగా ఖర్చు చేశాడు. ఆదాయంలో సగ భాగం ఆమె కోసమే వినియోగించేవాడు. ఇలా ఎంతకాలం ప్రేమించుకుంటామని, పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఓ శుభముహూర్తాన ఆమె ముందు ఓ ప్రతిపాదన ఉంచాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ప్రేయసి కోసం తాను ఎప్పుడు ఎంత ఖర్చుచేసిందీ లెక్క రాశాడు. ఆ మొత్తాన్ని వసూలు చేయాలని కోరాడు.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఆ బాధిత ప్రేమికుడి పేరు చేతన్. వయసు 31 సంవత్సరాలు. శంకరపురకు చెందిన అతడు ఓ యువతిని తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. సరుకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవించే చేతన్.. ఆమె సరదాలు, సంతోషం కోసం వచ్చిన జీతంలో సగ భాగాన్ని ఖర్చు చేసేవాడు. తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తూ, ఆమె సంతోషంగా ఉంటే చాలని ఎంతో ఖర్చు చేసినప్పటికీ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

చేతన్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించిందని, ప్రియురాలి కోసం రూ. 4.50 లక్షలు ఖర్చు చేశానని అందులో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి దానిని తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరాడని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News