Crime News: పేగు తెంచుకుపుట్టిన ఆరుగురు పిల్లలను బావిలోకి తోసేసిన తల్లి.. అందరూ మృతి

  • భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక తీవ్ర నిర్ణయం
  • అదే బావిలోకి దూకి ఆమె కూడా ఆత్మహత్యాయత్నం
  • పిల్లలంతా 18 నెలల నుంచి పదేళ్ల లోపు వారే
Woman Threw Her Six Kids into the well all dead

భర్త తరచూ తాగి వచ్చి కొడుతుండడం, అత్తింటి వారు వేధిస్తుండడంతో ఓ తల్లి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. పసివాళ్లని కూడా చూడకుండా పేగు తెంచుకుని పుట్టిన ఆరుగురు పిల్లలను బావిలోకి తోసేసి చంపేసిందా తల్లి. వారిలో ఐదుగురు ఆడపిల్లలే ఉన్నారు. చనిపోయిన పిల్లలు 18 నెలల నుంచి 10 ఏళ్ల వయసు లోపే వారు కావడం విషాదం. ఆమె కూడా అదే బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు గమనించి ఆమెను కాపాడినప్పటికీ, పిల్లల ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం మహారాష్ట్రలోని రాయ్ గఢ్ లోని బోరాగావ్ గ్రామంలో జరిగింది. 

పిల్లలను బావిలో పడేసిన ఆ తల్లిని రూనా సహానీగా గుర్తించారు. ఆ వివరాలను మహద్ పోలీసులు వెల్లడించారు. మద్యానికి బానిసైన తన భర్త వేధింపులను భరించలేకే ఆమె ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నామని, ఏ విషయమూ చెప్పే పరిస్థితిలో లేదని తెలిపారు. నిన్న రాత్రి 10 గంటల వరకు పిల్లల మృతదేహాలను బావి నుంచి బయటకు తీసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.  

More Telugu News