Modi government: కరోనా తర్వాత మోదీకి పెరిగిన ప్రజాదరణ.. తాజా సర్వేలో వెల్లడి

  • తమ అంచనాలను మోదీ సర్కారు చేరుకుందన్న 67 శాతం మంది
  • 2020, 2021 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రజామోదం
  • మత సామరస్యంలో ప్రభుత్వం మెరుగ్గా ఉందన్న 60 శాతం 
  • నిరుద్యోగ సమస్య, అధిక ధరలపై కొందరు ఆందోళన
Modi governments popularity at highest since start of pandemic

కరోనా వైరస్ మానవాళిపై విరుచుకుపడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. మన దేశంలో కరోనాతో 5.25 లక్షల మంది ఇప్పటి వరకు మరణించినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఏకంగా భారత్ లో 40 లక్షల మందికి పైగా మరణించినట్టు ఆ మధ్య ఓ నివేదిక విడుదల చేసింది. కానీ, అధికారిక గణాంకాల కంటే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు.

మరోవైపు ఈ సంక్షోభాన్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ  ప్రధాని నరేంద్రమోదీని ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయి. దేశ ప్రజలు కూడా ఇదే భావనతో వున్నారు. కరోనా తర్వాత ప్రధాని మోదీకి ప్రజాదరణ మరింత గరిష్ఠానికి చేరుకుందని 'లోకల్ సర్కిల్స్' నిర్వహించిన పోల్ లో తెలిసింది. ఒకవైపు నిరుద్యోగం, కమోడిటీ, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయినప్పటికీ, మరోవైపు మోదీ సర్కారుకు ప్రజాదరణ సైతం మరింత బలపడినట్టు లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది.

ఈ సర్వేలో భాగంగా 64,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని ఫలితాలను ప్రకటించారు. మోదీ ప్రభుత్వం తమ అంచనాలను అందుకుందని 67 శాతం మంది చెప్పారు. గతేడాది ఇలా చెప్పిన వారు 51 శాతమే ఉన్నారు. 2020లో 62 శాతం మంది ఇడే విధంగా చెప్పారు. అంటే గత రెండేళ్లతో పోలిస్తే మోదీ సర్కారు ఎక్కువ మంది ప్రజల అంచనాలను అందుకున్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

మూడో వేవ్ ను ప్రభుత్వం మెరుగ్గా ఎదుర్కొన్నదని.. ఆర్థిక వ్యవస్థను ప్రభావవంతంగా కొనసాగించినట్టు సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. అయితే, నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని అభిప్రాయపడ్డారు. కాకపోతే 37 శాతం మంది మోదీ సర్కారు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని నమ్ముతున్నారు. 73 శాతం మంది నిత్యావసరాలు, జీవన వ్యయాలు గత మూడేళ్లలో గరిష్ఠాల్లోనే ఉన్నాయని తెలిపారు. 2024లో మూడో విడత అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు అధిక ధరలు, నిరుద్యోగంపై దృష్టి సారించాలని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. 

తమ భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు పట్ల ఆశావహంగా ఉన్నట్టు 73 శాతం మంది చెప్పారు. కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని 44 శాతం మంది తెలిపారు. 60 శాతం మంది మత సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రభుత్వం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు అంగీకరించారు.

More Telugu News