Balakrishna: చిలకలూరిపేటలో 'అఖండ' సిల్వర్ జూబ్లీ వేడుకలు... హాజరైన బాలకృష్ణ

  • డిసెంబరు 2న రిలీజైన అఖండ
  • 175 రోజులు పూర్తి చేసుకున్న వైనం
  • రామకృష్ణ థియేటర్ లో వేడుకలు
  • తన తండ్రి ఎన్టీఆర్ కు అఖండ చిత్రం అంకితమన్న బాలయ్య
Balakrishna attends Akhanda silver jubilee celebrations at Chilakaluripet

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఘనవిజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది డిసెంబరు 2న రిలీజై 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో, అఖండ సిల్వర్ జూబ్లీ ఉత్సవం నిర్వహించారు. చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ అఖండ చిత్రాన్ని కారణజన్ముడైన తన తండ్రి నందమూరి తారకరామారావుకు అంకితం చేస్తున్నానని తెలిపారు. నందమూరి తారక రామారావు చేయని సినిమాలు లేవు, ఆయన పోషించని పాత్రలు లేవని కొనియాడారు. వారి బిడ్డగా జన్మించడం, కళామతల్లి దీవెనలతో తనకు కూడా అనేక రకాల పాత్రలు పోషించే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఆయన పేరు నిలబెట్టగలిగానని, సంతృప్తితో హృదయం నిండిపోయిందని వివరించారు. 

ఇక, తన జీవితంలో తాను సంపాదించిన విలువైన ఆస్తి అభిమానులేనని, వారు తనపై చూపించే ప్రేమను మించిన ఆస్తి లేదని బాలయ్య భావోద్వేగాలతో వ్యాఖ్యానించారు.

More Telugu News