IPL 2022: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలవాలంటున్న షోయ‌బ్ అక్త‌ర్‌!...అతడు చెప్పిన రీజ‌నిదే!

  • అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌
  • గుజ‌రాత్ టైటాన్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఢీ
  • టైటిల్‌తో వార్న్‌కు రాజ‌స్థాన్ నివాళి అర్పించాల‌న్న అక్త‌ర్‌
Shoaib Akhtar wants rajashtan royals win the ipltitle

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో నేటి రాత్రి అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్ల‌కు స‌మాన అవ‌కాశాలే ఉన్నా... ప‌లువురు క్రికెట్ ప్రముఖులు మ్యాచ్‌కు ముందే త‌మ ఓటు వీరికేనంటూ స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ మాజీ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఈ మ్యాచ్‌పై స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తాను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెల‌వాల‌ని కోరుకుంటున్నాన‌ని అత‌డు తెలిపాడు. అందుకు గ‌ల కార‌ణాన్ని కూడా అత‌డు వివరించాడు.

2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ తొలి సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజేత‌గా నిలిచిన విష‌యాన్ని అత‌డు గుర్తు చేశాడు. నాడు రాజ‌స్థాన్ కెప్టెన్‌గా దివంగ‌త షేన్ వార్న్ ఉన్న సంగ‌తిని కూడా అత‌డు ప్ర‌స్తావించాడు. ఇటీవ‌లే షేన్ వార్న్ మృతి చెందిన విష‌యాన్ని చెప్పిన అక్త‌ర్‌... తాజా సీజ‌న్‌లో విజేత‌గా నిలిచి క‌ప్‌ను షేన్ వార్న్‌కు అంకితం ఇవ్వాల‌ని, విజ‌యంతో వార్న్‌కు రాజ‌స్థాన్ నివాళి అర్పించాల‌ని అత‌డు పేర్కొన్నాడు. ఈ భావ‌న‌తోనే ఉన్న రాజస్థాన్ కాస్తంత దూకుడుగానే ఆడే అవ‌కాశాలున్నాయ‌ని కూడా అక్త‌ర్ చెప్పాడు. 

అయితే రాజస్థాన్‌తో పాటు గుజ‌రాత్ టైటాన్స్‌కు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని చెప్పిన అక్త‌ర్‌... గుజ‌రాత్ కంటే రాజ‌స్థాన్‌కే అధిక ఛాన్సుంద‌న్నాడు. గుజ‌రాత్ ఈ సీజ‌న్‌తోనే ఆరంగేట్రం చేయ‌గా... రాజ‌స్థాన్ మాత్రం ఆది నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతూనే ఉంద‌న్నాడు. ఈ క్ర‌మంలో ఫైన‌ల్‌లో గుజ‌రాత్ కంటే కూడా రాజ‌స్థాన్ ఒత్త‌డికి లోను కాకుండా ఒకింత దూకుడు క‌న‌బ‌రిచే అవ‌కాశాలున్నాయ‌ని అక్త‌ర్ చెప్పాడు.

More Telugu News