Andhra Pradesh: భక్తజనంతో పోటెత్తిన తిరుమల.. దర్శనం కావాలంటే భక్తులు ఓపికగా ఉండాలన్న టీటీడీ చైర్మన్

  • దర్శనానికి 24 గంటల సమయం
  • అన్ని ఏర్పాట్లు చేసుకుని రావాలని వైవీ సుబ్బారెడ్డి సూచన
  • ఆహారం, నీటి వసతి ఏర్పాటు చేసినట్టు వెల్లడి
Tirumala Streets Flooded With Devotees

వేసవి సెలవులు దగ్గరపడుతుండడంతో భక్త జనంతో తిరుమల పోటెత్తింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లతో పాటు పలు వీధులు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మండపం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనం పూర్తవ్వడానికి 24 గంటల సమయం పడుతోంది. 

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు పలు విజ్ఞప్తులు చేశారు. వేసవి సెలవులు కావడంతోనే భక్తుల రద్దీ అధికంగా ఉందని చెప్పారు. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఓపికగా ఉండాలని, దర్శనం అయ్యేంత వరకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసుకుని రావాలని సూచించారు. 

కరోనా పరిస్థితుల నేపథ్యంలో తిరుమలకు ఎక్కువ మంది భక్తులు రాలేకపోయారని, ఇప్పుడు కరోనా ఉపశమించడంతో రద్దీ ఎక్కువైందని తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు అవసరమయ్యే ఆహారం, నీటి వసతిని కల్పించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.

More Telugu News