DGCA: ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా... ఎందుకంటే...!

  • దివ్యాంగుడ్ని విమానం ఎక్కించుకోని ఇండిగో సిబ్బంది
  • ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ
  • ఇండిగో సిబ్బంది తీరును తప్పుబట్టిన వైనం
DGCA fined Indigo Airlines

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) భారీ జరిమానా వడ్డించింది. దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు నిరాకరించిందన్న కారణంతో డీజీసీఏ ఇండిగో సంస్థకు రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఆ బాలుడ్ని రాంచీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో ఎక్కించుకోకుండా, ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరు సరికాదని డీజీసీఏ పేర్కొంది.

అతడిని విమానం ఎక్కించుకోకపోగా, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే దిశగా ఇండిగో సిబ్బంది చర్యలు ఉన్నాయని వెల్లడించింది. ఆ దివ్యాంగుడైన బాలుడితో దయతో వ్యవహరించి ఉంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదని డీజీసీఏ తెలిపింది. 

ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనే కొన్ని అసాధారణ స్పందనలు కనబర్చాల్సి ఉంటుందని, కానీ సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆ విషయంలో విఫలమయ్యారని, పౌర విమానయాన స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించింది. కాగా, ఇటువంటి సంఘటనల నివారణకు త్వరలోనే నియమావళిని పునఃసమీక్షిస్తామని డీజీసీఏ వెల్లడించింది.

More Telugu News