YS Sharmila: నందమూరి తారక రామారావు గొప్ప నేత: వైఎస్ షర్మిల

  • ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న నేతలు, అభిమానులు
  • అనేక సంస్కరణలు తెచ్చిన నేత అని కొనియాడిన షర్మిల 
  • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న టీఆర్ఎస్ నేతలు
YS Sharmila pays tributes on NTR birth anniversary

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ లో స్పందించారు. 

పటేల్, పట్వారీ వ్యవస్థల రద్దు, చట్టసభల్లో బీసీలకు అవకాశాలు, రూ.2కే కిలో బియ్యం, స్త్రీలకు ఆస్తి హక్కు, సింగిల్ విండో విధానం వంటి పథకాలు, సంస్కరణలు చేపట్టిన గొప్ప నేత నందమూరి తారక రామారావు అని షర్మిల కీర్తించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నట్టు తెలిపారు. 

అటు, తెలంగాణ మంత్రులు, అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా హైదరాబాదులో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డితో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More Telugu News