Ranveer Singh: ఐపీఎల్ ముగింపు వేడుకకు ఏఆర్ రెహమాన్, రణవీర్ సింగ్

  • అహ్మదాబాద్ స్టేడియంలో 29 రాత్రి 8 గంటల నుంచి ఫైనల్స్
  • మ్యాచ్ ముగిసిన తర్వాత 45 నిమిషాల పాటు కార్యక్రమం
  • మాజీ కెప్టెన్లు, పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం
Bollywood star Ranveer Singh and music maestro AR Rahman to perform in the closing ceremony

ఐపీఎల్ తుది ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో నెగ్గి, ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కు ఘనమైన నివాళి అర్పించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2008లో మొదలు కాగా, తొలి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్ గా పనిచేసి తొలి కప్పు తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు కప్పు గెలిచింది లేదు. 

ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం 45 నిమిషాల పాటు కార్యక్రమానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇందులో పాల్గొననున్నారు. అలాగే, ఝార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందని సమాచారం. ఇందుకోసం బీసీసీఐ 10 మంది సభ్యుల ఝార్ఖండ్ ఛౌ డాన్స్ బృందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు వేడకకు హాజరుకానున్నారు. 2019 సీజన్ నుంచి ఐపీఎల్ ముగింపు వేడుక ఇప్పటి వరకు సాధ్యపడలేదు. 

More Telugu News