Niranjan Reddy: తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి ఆ అర్హత లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి

  • తెలంగాణపై మోదీ మరోసారి విషం చిమ్మారన్న మంత్రి 
  • మోదీ అధికారంలోకి వచ్చాక రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారని వ్యాఖ్య 
  • మేకిన్ ఇండియా అంటూ.. సేల్ ఇండియా చేపట్టారని విమర్శ 
Niranjan Reddy fires on Modi

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణపై మరోసారి విషం చిమ్మారని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరవీరుల గురించి ఉచ్చరించే అర్హత కూడా లేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని అమ్ముతుంటే... ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారని... ఆగస్టు వరకు మరో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టుకున్నారని అన్నారు. రూ. 11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మాఫీ చేయించిన మోదీ... రూ. 4వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపడం చేతకాని మోదీ... యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని  విమర్శించారు. 

మేకిన్ ఇండియా అని చెపుతూ... సేల్ ఇండియా చేపట్టారని మండిపడ్డారు. అంధ భక్తులను తయారు చేసి పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. వాట్సాప్ లో తప్పుడు ప్రచారాలు చేస్తూ, వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

More Telugu News