RGV: హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మపై చీటింగ్​ కేసు

  • రూ.56 లక్షలకు మోసం చేశారంటూ ఫైనాన్షియర్ ఫిర్యాదు
  • మాయమాటలు చెప్పి డబ్బు తీసుకున్నారని ఆరోపణ
  • ఆరు నెలల్లో ఇచ్చేస్తానని ఇప్పటికీ ఇవ్వలేదని వెల్లడి
Case Booked Against Varma in Hyderabad

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్ లో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ సినిమా కోసం రూ.56 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారంటూ ఓ ఫైనాన్షియర్ ఫిర్యాదు చేశారు. కోర్టు దావా ఆధారంగా ఆయన ఫిర్యాదు చేయడంతో మియాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదు చేశారు. 

‘‘2019లో నా స్నేహితుడి ద్వారా వర్మతో పరిచయం ఏర్పడింది. 2020లో దిశ సినిమా కోసం నా దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆ ఏడాది జనవరిలో రూ.8 లక్షలు ఇచ్చాను. ఆ తర్వాత మరోమారు రూ.20 లక్షలు ఇవ్వాల్సిందిగా వర్మ విజ్ఞప్తి చేయడంతో 2020 జనవరి 22న ఆ డబ్బు కూడా చెక్ రూపంలో ఇచ్చాను. ఆరు నెలల్లో తిరిగిచ్చేస్తానంటూ వర్మ చెప్పారు. ఆ తర్వాత అదే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఆర్థిక కష్టాలున్నాయని చెప్పి మరో రూ.28 లక్షలు తీసుకున్నారు. దిశ సినిమా విడుదలైన రోజు లేదా అంతకన్నా ముందే తిరిగిచ్చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయన్ను నమ్మి డబ్బులిచ్చాను’’ అని ఫైనాన్షియర్ చెప్పారు. 

అయితే, ఆ సినిమాకు వర్మ నిర్మాత కాదని తర్వాత తెలిసిందని, వర్మ తప్పుడు హామీలకు మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బును తిరిగిప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మియాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 

More Telugu News