Machilipatnam: మచిలీపట్నం బీచ్ లో విషాదం.. ఇద్దరు ఫార్మసీ విద్యార్థినుల దుర్మరణం!

  • మంగినపూడి బీచ్ వద్ద ఘటన
  • అలల తాకిడికి కొట్టుకు పోయిన విద్యార్థినులు
  • మెరైన్ పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చినా దక్కని ప్రాణాలు
Two BPharmacy woman students died at Machilipatnam beach

మచిలీపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా సముద్రతీరం వద్ద గడిపేందుకు వెళ్లిన బీఫార్మసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సముద్రపు నీట మునిగి దుర్మరణంపాలయ్యారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద ఈ ఘటన చోసుకుంది. 


కాకర ప్రమీల (22), కల్లేపల్లి పూజిత (22) ఇద్దరూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నారు. సరదాగా గడిపేందుకు సమీపంలోని మంగినపూడి బీచ్ కు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రపు నీటిలోకి దిగారు. అయితే అలల తాకిడికి ఇద్దరూ కొట్టుకుపోయారు. వీరిద్దరూ సముద్రంలోకి కొట్టుకుపోవడాన్ని చూసిన అక్కడున్న ఇతరులు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. 

ఆ ప్రాంతంలోనే విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని అమ్మాయిలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఒడ్డుకు చేర్చిన నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు.           

ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి మరణవార్తను వారి కుటుంబసభ్యులకు తెలియజేశారు. తమ బిడ్డల మరణ వార్త తెలియగానే వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

More Telugu News