Dhanush: నువ్వే మా కొడుకువి అంటున్న దంపతులకు లీగల్ నోటీసులు పంపిన హీరో ధనుష్

  • ధనుష్ మా కొడుకే అంటున్న దంపతులు
  • ఆరేళ్ల కిందట కోర్టుకు వెళ్లిన వైనం
  • కేసు కొట్టివేసిన కోర్టు
  • మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులు
  • ఇటీవల ధనుష్ కు కోర్టు సమన్లు
Dhanush sends legal notices to couple

తమిళ హీరో ధనుష్ కు కొన్నాళ్ల కిందట ఊహించని పరిస్థితి ఎదురైంది. ధనుష్ తమ బిడ్డేనంటూ తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షి కోర్టుకెక్కడం సంచలనం సృష్టించింది. అయితే ఈ వ్యవహారం వల్ల తమ పరువుకు భంగం కలుగుతోందంటూ ధనుష్, అతని తండ్రి కస్తూరిరాజా తాజాగా ఆ వృద్ధ దంపతులకు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. 

"ఇకపై ధనుష్ కు సంబంధించి వితండ వాదనలు చేయడం మానుకోవాలి. మీరు ఇక నుంచి నష్టదాయకమైన, తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండాలని నా క్లయింట్లు కోరుకుంటున్నారు. లేని పక్షంలో వారు తమ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. వారి పరువుకు భంగం కలిగించినందుకు మీ ఇద్దరిపై విచారణ జరుగుతుంది" అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

ధనుష్ తమ రక్తం పంచుకుపుట్టిన బిడ్డ అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు ఆరేళ్ల క్రితం మేలూరు కోర్టును ఆశ్రయించారు. ధనుష్ తమ మూడో కుమారుడని, సినిమాలపై ఆసక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయాడని వారు కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసును మేలూరు కోర్టు కొట్టివేయగా, ఆ వృద్ధ దంపతులు పట్టువదలని విక్రమార్కుల్లా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో మద్రాస్ హైకోర్టు ధనుష్ కు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ధనుష్ కూడా ప్రతిగా ఆ దంపతులకు లీగల్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.

More Telugu News