Krishna: ఫ్యాన్స్ ఉత్తరాలకు రిప్లై ఇచ్చేందుకు నేనే అతడ్ని మద్రాస్ తీసుకెళ్లాను: బీఏ రాజు సంస్మరణ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ

  • గతేడాది బీఏ రాజు హఠాన్మరణం
  • నేడు తొలి వర్ధంతి
  • హాజరైన సూపర్ స్టార్ కృష్ణ
  • బీఏ రాజు తన అభిమాని అని వెల్లడి
Superstar Krishna attends BA Raju first memorial meet

టాలీవుడ్ లో ప్రముఖులకు పీఆర్వోగా పనిచేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బీఏ రాజు, ఆపై నిర్మాతగానూ ఎదిగారు. అయితే, గతేడాది ఆయన హఠాన్మరణం చెందడం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. నేడు (మే 21) బీఏ రాజు తొలి వర్థంతి. ఈ సంస్మరణ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ తన అభిమాని బీఏ రాజును గుర్తుచేసుకున్నారు. రాజుతో తన అనుబంధాన్ని చెబుతూ, చలించిపోయారు. 

బీఏ రాజు తనకు వీరాభిమాని అని వెల్లడించారు. తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా తనను కలిసేవాడని వివరించారు. అప్పట్లో అభిమానుల నుంచి తనకు పెద్ద ఎత్తున ఉత్తరాలు వచ్చేవని, దాంతో ఆ ఉత్తరాలకు సమాధానం ఇచ్చేందుకు బీఏ రాజును తానే మద్రాస్ తీసుకెళ్లానని కృష్ణ తెలిపారు. బీఏ రాజు చాలా సంవత్సరాలు తన వద్దే పనిచేశాడని, తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరగడంలో అతడి పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. 

కొన్నాళ్లకు సినీ జర్నలిజంలోకి వెళ్లాలని ఉందని బీఏ రాజు చెప్పడంతో అతడిని 'జ్యోతిచిత్ర' పత్రికకు రికమెండ్ చేసినట్టు కృష్ణ వెల్లడించారు. అక్కడ్నించి సినీ రంగంలో పరిచయాలు పెంపొందించుకుని, జర్నలిస్టుగా ఎంతో ఎదిగాడని వివరించారు. 'సూపర్ హిట్' సినీ పత్రిక తీసుకువచ్చి ఎంతో సక్సెస్ అయ్యాడని, ఆ పత్రిక నెంబర్ వన్ అయిందని, అమెరికాలోనూ ప్రజాదరణ పొందిందని తెలిపారు. నిర్మాతగానూ మారి అభివృద్ధిలోకి వస్తున్నాడనుకుంటున్న తరుణంలో అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోవడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు.

More Telugu News