Prashant Kishor: కాంగ్రెస్ వైఫల్యాన్ని మరోసారి ఎత్తి చూపిన ప్రశాంత్ కిశోర్

  • ఉదయ్ పూర్ చింతన్ శివిర్ లో సాధించింది ఏదీ లేదన్న ప్రశాంత్ 
  • నాయకత్వానికి మరికొంత సమయం ఇచ్చారని వ్యాఖ్య
  • యథాతథ స్థితిని కొనసాగించారన్న ఎన్నికల వ్యూహకర్త
Failed to achieve anything says Prashant Kishor on Congresss Chintan Shivir

కాంగ్రెస్ పార్టీలో మార్పును చూద్దామనుకుని, ఆ పార్టీ వైఖరితో నిరాశకు గురైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా మరోసారి దీనిపై మాట్లాడారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిరాన్ని నిర్వహించుకుని, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. అర్థవంతమైన ఫలితాన్ని రాబట్టడంలో ఈ సదస్సు విఫలమైనట్టు ప్రశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘ఉదయ్ పూర్ చింతన్ శివిర్ పై వ్యాఖ్యానించాలంటూ తరచూ నన్ను అడుగుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం.. కనీసం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వరకు యథాతథ స్థితిని కొనసాగించడం, కాంగ్రెస్ నాయకత్వానికి మరింత సమయం ఇవ్వడం మినహా ఇందులో చెప్పుకోవడానికి సాధించింది ఏదీ లేదు’’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. 

2024 లోక్ సభ ఎన్నికల వ్యూహమే లక్ష్యంగా మూడు రోజుల చింతన్ శివిర్ లో కాంగ్రెస్ మేథోమధనం నిర్వహించడం తెలిసిందే. పార్టీ వరుస ఓటములు ఎదుర్కొంటున్నప్పటికీ.. పునరుత్థానం దిశగా చేస్తున్న కృషి కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీని ఎదుర్కొని బలంగా లేచి నిలబడేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రశాంత్ కిశోర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సూచించడం తెలిసిందే.

More Telugu News