Mahesh Babu: ఎక్కడో పొరపాటు జరిగిందంటూ... మహేశ్ బాబుకు అండగా నిలిచిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్!

  • బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన మహేశ్ బాబు వ్యాఖ్యలు
  • బాలీవుడ్ తనను భరించలేదని అన్నారంటూ ప్రచారం
  • మహేశ్ ఎంతో మంచి వ్యక్తి అని కితాబునిచ్చిన అమీషా
Ameesha Patel supports Mahesh Babu

బాలీవుడ్ పై మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు బీటౌన్ లో చర్చనీయాంశంగా మారాయి. 'మేజర్' సినిమా ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ... టాలీవుడ్ లో తనకు ఉన్న పేరుప్రఖ్యాతులు చాలని, బాలీవుడ్ కి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మరో రకంగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ తనను భరించే స్థాయిలో లేదని మహేశ్ అన్నాడంటూ ప్రచారం జరిగింది. దీంతో, బాలీవుడ్ లోని కొందరు మహేశ్ ను విమర్శించడం జరిగింది. 

మరోవైపు, మహేశ్ కు బాలీవుడ్ ప్రముఖుల్లో కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మహేశ్ మాటల్లో తప్పేముందని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇండియాలో టాలీవుడ్ టాప్ పొజిషన్ లో ఉందని... అలాంటప్పుడు మహేశ్ బాబుకు హిందీ పరిశ్రమ అంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పింది. 

తాజాగా మహేశ్ బాబుకు మరో బాలీవుడ్ భామ అమీషా పటేల్ మద్దతుగా నిలిచారు. మహేశ్ ఎంతో మంచి వ్యక్తి అని ఆమె కితాబునిచ్చారు. ఇతరుల పట్ల మహేశ్ ఎంతో గౌరవంగా ఉంటారని... అలాంటి వ్యక్తి బాలీవుడ్ ను కించపరిచే వ్యాఖ్యలు చేయరని చెప్పారు. దురుద్దేశంతో మహేశ్ అలాంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు. ఎక్కడో పొరపాటు జరిగిందని... ఎక్కడ జరిగిందనేది తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

పవన్ కల్యాణ్ 'బద్రి' చిత్రం ద్వారా అమీషా పటేల్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మహేశ్ బాబు సరసన 'నాని' సినిమాలో నటించి, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

More Telugu News