Kangana Ranaut: కాశీలో ప్రతీ భాగంలోనూ శివుడే.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు

  • మధురలోని ప్రతీ కణంలోనూ కృష్ణుడు ఉంటాడన్న కంగన 
  • అయోధ్యలోని ప్రతీ అణువులో రాముడు ఉంటాడని వ్యాఖ్య
  • కాశీలో శివుడికి నిర్మాణం అవసరం లేదని కామెంట్ 
 What Kangana Ranaut says on Gyanvapi mosque row

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. కాశీలో ఎక్కడ చూసినా శివుడేనని ఆమె వ్యాఖ్యానించింది. శివుడు కాశీలోని ప్రతి అణువులోనూ ఉన్నాడని, దానికి నిర్మాణం అవసరం లేదని ఆమె పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు, కంటెంట్ దృష్ట్యా ఆమెపై ట్విట్టర్ నిషేధం విధించడం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

‘‘మధురలో ప్రతీ అణువులోనూ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. అలాగే, అయోధ్యలోని ప్రతి భాగంలోనూ రాముడు ఉంటాడు. అదే మాదిరి కాశీలోని ప్రతి అణువులోనూ మహేశ్వరుడు ఉంటాడు. ఆయనకు నిర్మాణం అవసరం లేదు. ఆయన ప్రతి కణంలోనూ నివసిస్తుంటాడు’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. 

కంగనా రనౌత్ తాజాగా 'ధాకడ్' అనే సినిమాలో నటించిన తెలిసిందే. సినిమా విడుదలకు ముందు.. ఈ చిత్ర బృందం బుధవారం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. కంగన వెంట నటుడు అర్జున్ రామ్ పాల్, దివ్యాదత్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు జ్ఞానవాపి మసీదుపై స్పందించాలంటూ ఆమెను కోరడంతో పై విధంగా వ్యాఖ్యానించారు.

More Telugu News