Teacher: ఒక్కసారి ఫోన్ ఇమ్మని తీసుకుని పరిగెత్తిన దొంగ.. అతనిని వెంబడించి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రయాణికుడు!

  • ఫోన్ కాల్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకున్న వ్యక్తి
  • రైలు దిగి పారిపోయేందుకు ప్రయత్నం
  • పట్టుకునేందుకు పరుగు తీసిన ప్రయాణికుడు
  • అదుపుతప్పి పట్టాలపై పడిపోయిన వైనం  
Teacher Chasing Phone Thief Run Over By Train In Madhya Pradesh

తెలియని వ్యక్తులకు సాయం చేస్తే ప్రాణం మీదకు వస్తుందనడానికి నిదర్శనంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో ఒక ఘటన జరిగింది. 54 ఏళ్ల ప్రైవేటు పాఠశాల టీచర్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ కేసు వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. 

షాదోల్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనోజ్ నెమా అనే ప్రైవేటు స్కూల్ టీచర్ దుర్గ్-అజ్మీర్ రైలులో సాగర్ కు ప్రయాణం చేస్తున్నారు. రైలు షాదోల్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నప్పుడు.. ఒక గుర్తు తెలియని వ్యక్తి మనోజ్ వద్దకు వచ్చి అత్యవసరంగా కాల్ చేసుకోవాలంటూ ఫోన్ అడిగాడు. దీంతో మనోజ్ నెమా తన ఫోన్ ను ఇచ్చాడు. అపరిచితుడు ఫోన్ కాల్ చేస్తున్నట్టు నటించాడు. 

ఇంతలోనే రైలు షాదోల్ స్టేషన్ లో ఆగడంతో రైలు దిగి పరుగెత్తబోయాడు. అతడ్ని వెంబడించి పట్టుకునేందుకు మనోజ్ కూడా పరుగు తీశాడు. అదుపుతప్పి పట్టాలపై పడిపోవడం.. ఆ వెంటనే రైలు అతడిపై నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాలు విడిచినట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితుడైన రాజేంద్రసింగ్ ను అరెస్ట్ చేశారు. షాదోల్ జిల్లా ఖేరి గ్రామవాసిగా గుర్తించారు. ప్రయాణాలలో అపరిచితులకు ఏదీ ఇవ్వకూడదని ఈ ఘటన తెలియజేస్తోంది.

More Telugu News