Mahesh Babu: ఈ వేడుకకు ఇంతమంది వస్తారని ఊహించలేదు: మహేశ్ బాబు

  • మే 12న రిలీజైన సర్కారు వారి పాట
  • చిత్రానికి అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్
  • కర్నూలులో విజయోత్సవ సభ
  • దర్శకుడికే ఫుల్ క్రెడిట్ ఇచ్చిన మహేశ్
Mahesh Babu attends Sarkaaru Vaari Pata success meet

మహేశ్ బాబు, పరశురాం కాంబోలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విజయవంతమైన నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్ర బృందం కర్నూలులో 'మ మ మాస్..' పేరుతో సక్సెస్ వేడుక చేపట్టింది. 

ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడారు. ఈ సభకు ఇంతమంది వస్తారని తాను అనుకోలేదని, విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తే రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నంతగా అభిమానులు తరలివచ్చారని పేర్కొన్నారు. గతంలో 'ఒక్కడు' సినిమా షూటింగ్ కోసం కర్నూలు వచ్చానని, మళ్లీ ఇన్నాళ్లకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. 

సర్కారు వారి పాట చిత్రం చూడగానే తన కుమారుడు గౌతమ్ హగ్ ఇచ్చాడని, కుమార్తె సితార కూడా 'అన్ని సినిమాల్లోకి ఇందులోనే బాగా నటించావు నాన్నా' అని మెచ్చుకుందని చెబుతూ మహేశ్ బాబు ఆనందంతో పొంగిపోయారు. 

తన తండ్రి కృష్ణ సైతం ఈ సినిమా హిట్ పై నమ్మకంతో ఉన్నారని, పోకిరి, దూకుడు చిత్రాలను మించిపోయి ఆడుతుందని ఆయన ముందే చెప్పారని మహేశ్ బాబు వెల్లడించారు. ఈ విజయం వెనుక దర్శకుడు పరశురామ్ కృషి ఉందని, ఆ ఘనత అతడికే చెందాలని వినమ్రంగా తెలిపారు.
.

More Telugu News