Marsh: మార్ష్ అర్ధసెంచరీ... ఓ మోస్తరు స్కోరు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

  • ముంబయిలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు
  • 63 పరుగులు చేసిన మార్ష్
With Marsh fifty Delhi Capitals posted reasonable score

విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గోల్డెన్ డక్ నమోదు చేయగా, మరో ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ అర్ధసెంచరీ సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ పోరులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. 

ఢిల్లీ ఇన్నింగ్స్ లో వార్నర్ తొలి బంతికే అవుటయ్యాడు. పార్ట్ టైమ్ బౌలర్ లియామ్ లివింగ్ స్టోన్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన వార్నర్ క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మార్ష్ స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అటు, ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ధాటిగా ఆడాడు. సర్ఫరాజ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు సాధించాడు. 

లలిత్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) లివింగ్ స్టోన్ బౌలింగ్ లో ఓ భారీ సిక్స్ బాది, ఆ తర్వాతి బంతికే స్టంపౌట్ అయ్యాడు. హార్డ్ హిట్టర్ రోవ్ మాన్ పావెల్ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ వికెట్ కూడా లివింగ్ స్టోన్ ఖాతాలోకే చేరింది. 

ఓవరాల్ గా లివింగ్ స్టోన్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. రబాడాకు 1 వికెట్ దక్కింది.

More Telugu News