Telugu Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు ఇవే!

  • థియేటర్లు, ఓటీటీల్లో రాబోతున్న పలు చిత్రాలు
  • సిల్వర్ స్క్రీన్ పై విడుదల కానున్న 'శేఖర్', 'ధగడ్ సాంబ'
  • ఓటీటీలో వస్తున్న 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య'
Telugu movies releasing this week

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత సినీ పరిశ్రమ మళ్లీ గాడిలో పడుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లు, ఓటీటీల్లో విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఒకవైపు థియేటర్లలో.. మరోవైపు ఇంట్లో టీవీలు, చేతిలోని సెల్ ఫోన్లలో అభిమానులను ఉర్రూతలూగించడానికి రెడీగా ఉన్నాయి. ఈ వారం సందడి చేయనున్న సినిమాలు ఇవే. 

థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు:

శేఖర్:  రాజశేఖర్ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో... వీరి పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రను పోషించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రం మే 20న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ మరో ఘన విజయాన్ని అందుకోబోతున్నారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. 

ధగడ్ సాంబ: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు, సోనాక్షి జంటగా నటించిన 'ధగడ్ సాంబ' చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఆర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా చాలా క్లీన్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు చెపుతున్నారు. ఈ చిత్రంలో జ్యోతి, చలాకీ చంటి, మిర్చి మాధవి తదితరులు నటించారు. 

ధాకడ్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన 'ధాకడ్' సినిమా ట్రైలర్ కు ఇప్పటికే ఎంతో స్పందన లభించింది. ఏజెంట్ అగ్ని పాత్రలో కంగన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

భూల్ భులయ్యా2: హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఇది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రంలో టబూ కీలక పాత్రను పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. 

ఓటీటీల్లో విడుదల కాబోతున్న చిత్రాలు:

ఆర్ఆర్ఆర్: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా థియేటర్లలో విడుదలై కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మే 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. 

ఆచార్య: చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మెగా అభిమానులకు కాస్తంత నిశాశను మిగిల్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

భళా తందనాన: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడరామ్, పోసాని కృష్ణమురళి నటించిన ఈ చిత్రం మే 6న థియేటర్లలో విడుదలయింది. రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీలో రాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 20 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

More Telugu News