KTR: తెలంగాణ‌కు ప‌నికొచ్చే ఒక్క మాట కూడా అమిత్ షా ప్ర‌సంగంలో లేదు: కేటీఆర్‌

  • అమిత్ షా చెప్పిన మాట‌ల్లో ఒక్క‌టీ నిజం లేదు
  • తుక్కుగూడ‌లో చెప్పిన తుక్కు మాట‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేరు
  • గ‌త ఎన్నిక‌ల్లో 108 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేద‌న్న కేటీఆర్‌
ktr comments on amit shah speech

హైద‌రాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో నిర్వహించిన స‌భ‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాట‌ల్లో ఒక్క‌టి కూడా నిజం లేద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. అమిత్ షా ప‌చ్చి అబ‌ద్ధాలు, అర్థ స‌త్యాలు మాట్లాడార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. అందుకే ఆయ‌న అమిత్ షా కాద‌ని, అబ‌ద్ధాల బాద్ షా అని కేటీఆర్ విమ‌ర్శించారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వహించిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన కేటీఆర్‌... అమిత్ షా చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. 

అమిత్ షా ప్ర‌సంగంలో తెలంగాణ‌కు ప‌నికొచ్చే ఒక్క మాట‌ కూడా లేద‌న్న కేటీఆర్‌.. డ‌బ్బాలో గుల‌క‌రాళ్లు వేసి ఊపితే వ‌చ్చే శబ్ధం మాదిరిగానే అమిత్ షా ప్ర‌సంగం ఉంద‌న్నారు. తుక్కుగూడ‌లో చెప్పిన తుక్కు మాట‌ల‌ను న‌మ్మే స్థితిలో తెలంగాణ ప్ర‌జ‌లు లేర‌ని కేటీఆర్ అన్నారు. వాస్త‌వానికి బీజేపీకి క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేద‌న్న కేటీఆర్‌... గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 108 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం డిపాజిట్లు కూడా రాలేద‌న్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పట్టించేలా చేశార‌ని కేటీఆర్ ఆరోపించారు. వాట్సాప్ యూనివ‌ర్సిటీలో తిరిగే విష‌యాల‌నే వాస్త‌వాలుగా భ్ర‌మింప‌జేసే య‌త్నాలు చేశార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

More Telugu News