Amit Shah: కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు బండి సంజ‌య్ ఒక్క‌డు చాలు: అమిత్ షా

  • కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు తాను రాన‌క్క‌ర‌లేదన్న అమిత్ షా 
  • బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోస‌మే సంజ‌య్ యాత్ర‌ అని వివరణ 
  • నీళ్లు, నిధులు, నియామ‌కాల హామీ అమ‌లు బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్య 
  • కేసీఆర్‌లాంటి అస‌మ‌ర్థ సీఎంను తానెప్పుడూ చూడ‌లేద‌న్న అమిత్ షా
amit shah comments in tukkufguda meeting

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారును గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పిన బీజేపీ అగ్ర‌నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... అందుకోసం తాను తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు బండి సంజ‌య్ ఒక్క‌డే చాల‌ని కూడా అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట పాద‌యాత్ర చేసిన బండి సంజయ్ త‌న యాత్ర‌ను శ‌నివారం ముగించారు. దీనిని పురస్కరించుకుని, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌సంగం చేసిన అమిత్ షా... కేసీఆర్ స‌ర్కారుపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌లో వార‌స‌త్వ రాజ‌కీయాలు పరాకాష్ఠకు చేరాయ‌ని అమిత్ షా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ను సాధిస్తామ‌ని హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌...ఆ హామీల‌ను తుంగ‌లో తొక్కార‌ని విమ‌ర్శించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామ‌కాల హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ హామీని నిల‌బెట్టుకునే శ‌క్తి ఒక్క బీజేపీకి మాత్ర‌మే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. హైద‌రాబాద్ విముక్తి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని అమిత్ షా చెప్పారు. తెలంగాణ‌ను కేసీఆర్ మ‌రో బెంగాల్ లా మారుస్తార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

బండి సంజ‌య్ సాగించిన పాద‌యాత్ర అధికారం కోస‌మో, ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి అధికార బ‌దలాయింపు కోస‌మో కాద‌ని అమిత్ షా చెప్పారు. బ‌డుగు, బ‌ల‌హీన వర్గాల అభ్యున్న‌తి కోసమే బండి సంజ‌య్ పాద‌యాత్ర సాగింద‌న్నారు. కొడుకు, కూతురుకు అధికారం ఇచ్చిన కేసీఆర్ సర్పంచ్‌ల‌కు మాత్రం అధికారం ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. 

కేసీఆర్ పాల‌న‌ను సాగ‌నంపేందుకు తెలంగాణ యువ‌త సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొన‌లేక‌పోతే త‌క్ష‌ణ‌మే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కేసీఆర్ లాంటి అస‌మ‌ర్థ సీఎంను త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని కూడా ఆయ‌న కీల‌క వ్యాఖ్య చేశారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని అమిత్ షా తెలిపారు.

More Telugu News