Shares: ఎల్ఐసీ ఏ ధర వద్ద లిస్ట్ అవుతుంది.. గ్రే మార్కెట్లో తక్కువ ధరకే ట్రేడ్

  • మొన్నటి వరకు షేరుకు రూ.40 ప్రీమియం
  • తాజాగా మైనస్ 30 రూపాయలకు డౌన్
  • ఇష్యూ ధర రూ.949
  • పాలసీదారులకు రూ.60, రిటైలర్లకు రూ.45 డిస్కౌంట్
Shares of LIC are trading at a discount of about 30 rupees

ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీ హోల్డర్లు ఎంతో ఆసక్తి చూపించారు. పాలసీ హోల్డర్లు, రిటైలర్ల కోటా పలు రెట్ల మేర అధిక స్పందన అందుకుంది. అందరికీ తెలిసిన సంస్థ కావడం, దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరికైనా ఎల్ఐసీ పాలసీ ఉండడం.. ఐపీవో పట్ల ఆసక్తిని పెంచాయి. దీనికితోడు గత రెండేళ్ల కాలంలో ఈక్విటీలవైపు పెద్ద ఎత్తున కొత్త ఇన్వెస్టర్లు రావడం కూడా అనుకూలించిందని చెప్పుకోవాలి.

అయితే, ఒక్కో షేరు జారీ ధరగా రూ.949ను ఎల్ఐసీ ఖరారు చేసింది. పాలసీదారులకు రూ.60 తగ్గింపు ఉంటుంది. కనుక వారికి ఒక్కో షేరు రూ.889కి రానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 తగ్గింపు లభిస్తుంది. అంటే ఒక్కో షేరు రూ.904కు వారికి రానుంది. ఐపీవోల్లో పాల్గొనే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది మంచి లాభాలతో లిస్ట్ అయితే వెంటనే అమ్ముకోవచ్చన్న ఆశతో పాల్గొంటుంటారు. మరి ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్ లో లాభాలు తినిపిస్తుందా..? ఇదే సందేహం ఇన్వెస్టర్లలో నెలకొంది.

ఇటీవల ఉన్నట్టుండి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతుండడం చూస్తున్నాం. దీంతో నెగెటివ్ సెంటిమెంట్ నెలకొంది. ఇదే ప్రభావం అటు గ్రే మార్కెట్లోనూ కనిపిస్తోంది. ఐపీవోకు ముందే సంబంధిత షేర్లలో లావాదేవీలకు గ్రే మార్కెట్ వీలు కల్పిస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం వరకు గ్రే మార్కెట్లో ఒక్కో ఎల్ఐసీ షేరుకు 40 రూపాయిల ప్రీమియం పలికింది. ఇప్పుడేమో ఏకంగా మైనస్ 30 రూపాయిలకు పడిపోయింది. అంటే ఇష్యూ ధర రూ.949 కంటే రూ.30 తక్కువకు విక్రయిస్తేనే కొనేవారున్నట్టు అర్థం చేసుకోవాలి. 

వచ్చే రెండు మూడు రోజుల్లో సానుకూల పవనాలు స్టాక్ మార్కెట్లను తాకితే తప్ప.. ఎల్ఐసీ లిస్టింగ్ లో ఇన్వెస్టర్లను మురిపించనట్టే కనిపిస్తోంది. అయినా పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ ధరకు షేర్లు లభిస్తున్నాయి కనుక కొంత రక్షణ ఉంటుందని అనుకోవచ్చు.

More Telugu News