Taj Mahal: తాజ్ మహల్ కింద హిందూ దేవతల విగ్రహాలు లేవంటున్న ఏఎస్ఐ!

  • రికార్డుల్లోనూ అందుకు ఆధారాల్లేవన్న అధికారులు 
  • తాజ్ మహల్ కింద ఉన్న సెల్స్ కు నవీకరణ పనులు జరుగుతున్నాయని వివరణ 
  • వాటిని ఇటీవలే తెరిచినట్టు చెప్పిన అధికారులు
Taj Mahal cells not always locked have no idols ASI officials

‘తాజ్ మహల్ కింద ఉన్న 22 గదులను తెరిపించండి. అందులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చండి’ అంటూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసిపుచ్చింది. తాజ్ మహల్ ను నిర్మించిన స్థలం జైపూర్ రాజ కుటుంబానికి చెందినదిగా బీజేపీ ఎంపీ దియాకుమారి సైతం ప్రకటించారు. దీంతో తాజ్ మహల్ కింద ఏముంది? అన్న చర్చ మరోసారి మొదలైంది.

అయితే, తాజ్ మహల్ సమాధి కింది భాగంలో ఉన్న సెల్స్ (గదుల మాదిరి) ఎప్పుడూ మూసి ఉంచేవి కావని భారత పురాతత్వ పరిశోధన శాఖ (ఏఎస్ఐ) అధికారులు అంటున్నారు. లక్నో బెంచ్ లో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్న అంశాలు తప్పు అని స్పష్టం చేశారు. ఆ గదులను ఇటీవలే పునరుద్ధరణ పనుల కోసం తెరిచినట్టు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి వరకు పరిశీలించిన అన్ని రికార్డుల ఆధారంగా అక్కడ విగ్రహాలు ఉన్నట్టు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

తాజ్ మహల్ ప్రాంగణంలో మొత్తం మీద 100 సెల్స్ వరకు ఉంటాయని, రక్షణ, భద్రత దృష్ట్యా వీటిని ప్రజల కోసం తెరవడం లేదని కొందరు భావిస్తున్నారు. లక్నో బెంచ్ లో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నట్టు 11 గదులు శాశ్వతంగా లాక్ చేసినవి కావని పురాతత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాటిని ఇటీవలే తెరిచి నవీకరణ పనులు చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News