Type 2 diabetes: టైప్-2 మధుమేహానికి కారణం తెలిసింది!

  • చాపకింద నీరులా విస్తరిస్తున్న టైప్-2 డయాబెటిస్
  • భారత్‌లో  ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ సమస్య
  • జన్యుపరమైన వైవిధ్యాలే ఇందుకు కారణమని తేల్చిన అధ్యయనం
  • పరిశోధనలో కీలక పాత్ర పోషించిన సీసీఎంబీ శాస్త్రవేత్త
Scientists find cause for type 2 diabetes

చాపకింద నీరులా విస్తరిస్తున్న టైప్-2 డయాబెటిస్‌కు గల కారణం తెలిసింది. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు దీని బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గత దశాబ్దకాలంలో టైప్-2 డయాబెటిస్ బారినపడుతున్న వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఏయే కారణాలు అందుకు దారితీస్తాయి? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికేందుకు ప్రారంభించిన అధ్యయనంలో కొత్త విషయం బయటపడింది. 

బ్రిటన్‌లోని మాంచెస్టర్ వర్సిటీ నిర్వహించిన  అధ్యయనంలో జన్యుపరమైన వైవిధ్యాలే ఇందుకు దారితీస్తున్నట్టు వెల్లడైంది. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ గిరిరాజ్ ఆర్ చందక్ ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించారు.

టైప్-2 మధుమేహ సమస్యకు మానవ జన్యువులు ఎంతమేరకు కారణమవుతున్నాయి?  అన్న దానిపై జరిపిన ఈ పరిశోధనలో భాగంగా యూరోపియన్, తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, హిస్పానిక్ ప్రజలను పరీక్షించారు. మొత్తంగా 11.6 లక్షల మందితోపాటు 1.8 లక్షల మంది టైప్-2 డయాబెటిస్ బాధితుల డీఎన్ఏలను తులనాత్మకంగా విశ్లేషించారు. 

ఈ సందర్భంగా సాధారణ వ్యక్తులతో పోలిస్తే టైప్-2 డయాబెటిస్ బారినపడిన వారిలో జన్యుపరమైన వైవిధ్యాలు అధికంగా ఉన్నట్టు తేలింది. భారత ప్రజల్లో ఉండే జన్యుపరమైన వైవిధ్యాలే టైప్-2 మధుమేహానికి కారణమని తేల్చారు. డయాబెటిస్ ఔషధాల తయారీకి ఈ అధ్యయనం ఎంతగానో ఉపకరిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి పేర్కొన్నారు.

More Telugu News