Mahesh Babu: మూవీ రివ్యూ: 'సర్కారువారి పాట'

  • ఈ రోజునే విడుదలైన 'సర్కారువారి పాట'
  • ఇది మహేశ్ బాబు మార్కు మూవీ  
  • మహేశ్ ను .. కీర్తిని కొత్త గా చూపించిన పరశురామ్ 
  • కథాకథనాల్లో సడలిన పట్టు 
  • పాటల పరంగా సూపర్ హిట్ 
  • మహేశ్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా   
Sarkaru Vaari Paata movie review

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ రూపొందించిన 'సర్కారువారి పాట' సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. మైత్రీ .. 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. హ్యాట్రిక్ హిట్ తరువాత మహేశ్ బాబు .. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరశురామ్ చేసిన ఈ సినిమాలో ఆడియన్స్ ఆశించిన అంశాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

సాధారణ ప్రజలు బ్యాంకు 'లోన్' తీసుకుని ఏ కారణం చేతనైనా కట్టలేకపోతే బ్యాంకులు వాళ్లను చాలా ఇబ్బందులు పెడుతుంటాయి. అదే అధికారం .. పరపతి ఉన్నవారు వేల కోట్లను అప్పుగా తీసుకుని చెల్లించలేకపోయినా నోటీసులు ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తుంటారు. ఇలాంటివారి వలన అనేక బ్యాంకులు దివాలా తీశాయి. బ్యాంకు 'లోన్' చెల్లించని ఒక వ్యాపారవేత్తను తన దారిలోకి తీసుకుని రావడానికి హీరో ఏం చేశాడనేదే ఈ సినిమా కథ.

ఈ కథ వైజాగ్ లో మొదలై వైజాగ్ లోనే ముగుస్తుంది. బ్యాంకు 'లోన్' చెల్లించలేని పరిస్థితుల్లో మహి (మహేశ్ బాబు) తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. పదేళ్ల వయసున్న మహిపై ఆ సంఘటన చాలా ప్రభావం చూపుతుంది. ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదని అప్పుడే అతను అనుకుంటాడు. ఆ తరువాత అతను విదేశాల్లో డబ్బును వడ్డీలకి ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. అతని అసిస్టెంట్ గా కిశోర్ (వెన్నెల కిశోర్) ఉంటాడు. తన దగ్గర తీసుకున్న డబ్బును వడ్డీతో సహా ఎలా వసూలు చేయాలో మహికి బాగా తెలుసు.

అక్కడ తన స్నేహితులతో కలిసి 'కాసినో'లో పేకాట ఆడుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కళావతి (కీర్తి సురేశ్). జూదం ఆడటానికిగాను ఆమెకి డబ్బు అవసరమవుతుంది. మహి బలహీనతను గమనించిన ఆమె, తన చదువు కోసమని అబద్ధాలు చెప్పి ఆయన దగ్గర నుంచి 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది. ఆమెను అమాయకురాలిగా  .. పద్ధతి కలిగిన పిల్లగా భావించిన మహి అప్పుతో పాటు తన మనసు కూడా ఇచ్చేస్తాడు. దాంతో అతని దగ్గర నుంచి మరింత డబ్బులాగడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఒక శుభ ముహూర్తాన కళావతి నిహస్వరూపం మహికి తెలిసి పోతుంది. దాంతో ఆయన తన దగ్గర తీసుకున్న డబ్బు చెల్లించమని నిలదీస్తాడు. ఆ క్షణమే ఇండియాలో ఉన్న తన తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని)కి కాల్ చేసి మహిని బెదిరించాలని కళావతి ప్రయత్నిస్తుంది. తన డబ్బు ఎలా వసూలు చేసుకోవాలో తనకి బాగా తెలుసని చెప్పిన మహి, ఇండియాకి చేరుకుంటాడు. 

అప్పు తీసుకోడమే తప్ప తీర్చడం అలవాటు లేని రాజేంద్రనాథ్ ని కలుసుకుంటాడు. రాజేంద్రనాథ్ మాటలతో వినేరకం కాదనే విషయం మహికి అర్థమైపోతుంది. రాజకీయంగా ఆయనకి ఉన్న పలుకుబడి ఎలాంటిదో స్పష్టమవుతుంది. అలాంటి రాజేంద్రనాథ్ ను మహి ఎలా ఎదుర్కున్నాడు?  ఆ ప్రయత్నంలో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా అధిగమించాడు? అనేదే కథ.

దర్శకుడు పరశురామ్ తయారు చేసుకున్న కథ .. కథనాలు అంత బలమైనవేం కావు. కాకపోతే సాధ్యమైనంతవరకూ బోర్ కొట్టించకుండా కథను ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలా అనే విషయంపైనే ఆయన దృష్టి పెట్టాడు. కథలోని పాయింట్ అందరికీ తెలిసిందే అయినా, తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేయడానికి ఆయన ప్రయత్నించాడు. హీరో తల్లిదండ్రులు సూసైడ్ లెటర్ రాసి .. దానిపై ఒక రూపాయి కాయిన్ ఉంచేసి .. తాము ఇచ్చేది అదేనని చెప్పడం సిల్లీగా అనిపిస్తుంది. హీరో మెడపై రూపాయి కాయిన్ టాటూ కోసం పరశురామ్ మరో ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తుంది. 

ఇక కథ మొదలవ్వగానే ఒక భారీ ఛేజింగ్ తో కూడిన ఫైటు .. ఆ వెంటనే 'పెన్నీ' సాంగ్ వచ్చేస్తాయి. ఆ తరువాతనే కథ నిదానంగా కుదురుకుంటుంది. ఒక రూపాయి కాయిన్ తో ఇంట్లో నుంచి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పదేళ్ల కుర్రాడు  .. ఫారిన్ లో ఆఫీసు పెట్టేసి మరీ వడ్డీ వ్యాపారం చేసే స్థాయికి ఎలా వచ్చాడబ్బా? అనే లాజిక్కులు లాగడానికి ప్రయత్నించకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోవాలంతే. అప్పు కోసం కీర్తి సురేశ్ పడే ఆశ .. ఆమె కోసం మహేశ్ పడే ఆరాటం .. వాళ్లిద్దరి తీరు పట్ల వెన్నెల కిశోర్ అయోమయానికి లోను కావడం కథలో కావలసినన్ని నవ్వులు పూయిస్తాయి.

అయితే కథ హీరోతో పాటు ఇండియా వచ్చేసిన తరువాత వెన్నెల కిశోర్ పాత్ర  ప్రేక్షకులకు దూరమవుతుంది. ఇక కథానాయిక ఉందనే విషయం చాలా సేపటికి గాని దర్శకుడికి గుర్తుకురాదు. కళావతి ఇండియా వచ్చిన తరువాత హీరో ఆమెను బెదిరించి ప్రతి రోజు రాత్రి తన రూముకి పిలిపించుకునే ట్రాక్ కూడా కొంతవరకూ కామెడీని కవర్ చేస్తుంది. అలాగే ఆర్ధిక ఇబ్బందులతో అవస్థలు పడే మాస్టారుగా తనికెళ్ల భరణి పాత్ర వైపు నుంచి ఎమోషన్ వర్కౌట్ అయింది. బీచ్ లో యాక్షన్ సీన్ కూడా ఒక రేంజ్ లోనే ఉంది.

'అప్పు .. ఆడపిల్లలాంటిది' అంటూ మహేశ్ ఇచ్చిన కొటేషన్, 'అప్పు సెటప్పులాంటిది' అంటూ సముద్రఖని ఇచ్చిన కొటేషన్ ఈ పాత్రల స్వభావానికి అద్దం పడతాయి. కథలోని పాయింటును కనెక్ట్ చేస్తాయి. మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ .. సముద్రఖని పాత్రలను డిజైన్ చేసిన విధానంలో పరశురామ్ ను మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా కీర్తి సురేశ్ ను ఆయన కొత్త కోణంలో చూపించాడు. అయితే కొన్ని సీన్స్ అంతగా లాగవలసిన అవసరం లేదనిపిస్తుంది. కొంత కథ నడిచిన తరువాత మహేశ్ హెయిర్ స్టైల్ తేడా కొట్టేసింది. ఇక కీర్తి సురేశ్ కి కూడా అక్కడక్కడా మేకప్ కుదరలేదు. ఈ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

గతంలో మహేశ్ ఒక సినిమాలో ముంబైని 'డ్యాష్' పోయించడానికి వచ్చానని అంటాడు. ఈ సినిమాలో ఆ  డ్యాష్ లో ఉన్న మాటను ఒకటికి నాలుగుసార్లు ఇతర పాత్రలతోను అనిపించడం ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే మాస్టారు గారి భార్యను సపోర్టు చేస్తూనే మహేశ్ సగం చెప్పి వదిలేసిన డైలాగ్ కూడా అలాంటిదే. బ్యాంకు లోన్ కి సంబంధించిన సీన్స్ .. సంభాషణలు కాస్త క్లాస్ తీసుకుంటున్నట్టుగా  కూడా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ కాస్త గందర గోళంగా అనిపిస్తుంది. లవ్ .. కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ తో కథను బోర్ కొట్టించకుండా నడిపించడంలో పరశురామ్ కొంతవరకూ సక్సెస్ అయ్యాడు.

ఇక తమన్ తన పాటలతో  కథకు కొత్త ఉత్సాహాన్ని తీసుకుని వచ్చాడనే చెప్పాలి. పాటలన్నీ కూడా జోరుగా .. హుషారుగా .. కలర్ఫుల్ గా కొనసాగుతాయి.  అయితే 'కళావతి' పాటలో మ్యూజిక్ లెంగ్త్ లో వేరే  సీన్స్ డైలాగ్స్ తో సహా చూపించడంతో, పాటకి సంబంధించిన విజువల్స్ ను .. స్టెప్స్ ను మిస్సయ్యామనే అసంతృప్తి కలుగుతుంది. మధి కెమెరా పనితనం .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఆట్టుకునేలా ఉన్నాయి. కొన్ని లోపాలను సరి చేసుకుంటూ .. కొన్ని లాజిక్కులను వదిలేసుకుంటూ వెళితే, ఇది మహేశ్ అభిమానులను ఆకట్టుకునే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

---  పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News