India: శ్రీ‌లంక‌లో హింసాత్మ‌క‌ ప‌రిస్థితులపై మండిప‌డ్డ ఆ దేశ మాజీ క్రికెట‌ర్లు

  • హక్కుల కోసం ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల్లో పాల్గొంటున్నార‌న్న ముంబై ఇండియన్స్‌ కోచ్‌ జయవర్ధనే 
  • శ్రీ‌లంక‌ ప్రభుత్వ మద్దతుతో గూండాలు దాడి చేస్తున్నార‌ని ఆగ్ర‌హం
  • హింస వెనుక ప్రభుత్వం ఉందన్న‌ రాజస్థాన్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర
cricketers on Sri Lanka Crisis

శ్రీ‌లంక‌లో ప‌రిస్థితులు చేజారిపోవ‌డంతో అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా, శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్లు త‌మ దేశ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం శాంతియుతంగా ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల్లో పాల్గొంటుంటే వారిపై శ్రీ‌లంక‌ ప్రభుత్వ మద్దతుతో గూండాలు దాడి చేస్తున్నార‌ని ముంబై ఇండియన్స్‌ కోచ్‌ జయవర్ధనే అన్నారు. 

ప్ర‌భుత్వం పాల్ప‌డుతోన్న చ‌ర్య‌లు చూస్తుంటే అసహ్యమేస్తోందని ట్వీట్ చేశారు. పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను కొంద‌రు దుండ‌గులు కొట్టార‌ని తెలుపుతూ అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయ‌న పోస్ట్ చేశారు. నిన్న శాంతియుతంగా నిరసన చేసిన ప్ర‌జ‌ల‌పై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం స‌రికాద‌ని అన్నారు.  

ప్ర‌జ‌ల‌పై జ‌రుగుతోన్న హింస వెనుక ప్రభుత్వం ఉందని శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్‌ రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని చెప్పారు. అమాయక ప్ర‌జ‌ల‌పై జరిగిన దాడి అనాగరిక చర్య అని లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ అన్నారు. శ్రీ‌లంక‌ను ఇటువంటి నాయకత్వం నడిపిస్తోందని విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశం కోసం తాను అందరి పక్షాన ఉంటానని చెప్పారు. 

శాంతియుత నిరసనలు తెలుపుతోన్న అమాయక ప్రజలపై దాడులు జరగడం త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్ వెల్లా చెప్పారు. కాగా, తాజాగా చోటు చేసుకున్న‌ హింసలో ఐదుగురు మృతి చెంద‌గా, దాదాపు 200 మందికి గాయాల‌య్యాయి. కొన్ని రోజుల క్రితం కూడా కొంద‌రు క్రికెట‌ర్లు త‌మ ప్ర‌భుత్వ తీరును ఎండగ‌ట్టారు.

More Telugu News