Syed Ashrin Sultana: నా భర్తను చంపేశాడుగా.. ఇప్పుడు పరువు దక్కిందేమో అడుగుతా: అశ్రిన్ సుల్తానా

  • మోబిన్ కొట్టడం వల్లే తండ్రి చనిపోయాడన్న అశ్రిన్
  • ఆయన బతికి ఉంటే ఇప్పుడీ కష్టాలు వచ్చేవి కాదని ఆవేదన
  • ఇంటర్ నుంచే నాగరాజుతో పరిచయం
  • చిన్నప్పటి నుంచే మోబిన్ క్రూరంగా ప్రవర్తించేవాడు
give me five minutes to ask my brother whether honour is back says ashrin sultana

జైలులో ఉన్న తన సోదరుడితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పరువు హత్యలో భర్తను కోల్పోయిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అధికారులను కోరుతున్నారు. తన భర్తను హత్య చేసిన తర్వాత పోయిన పరువు తిరిగి వచ్చిందేమో అతడిని అడిగి తెలుసుకుంటానని అశ్రిన్ నీళ్లు నిండిన కళ్లతో పేర్కొన్నారు. మతాంతర వివాహం చేసుకుందన్న కక్షతో సోదరి అశ్రిన్ భర్త నాగరాజును ఆమె సోదరుడు సయ్యద్ మోబిన్ అహ్మద్ తన బావతో కలిసి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్ శివారులోని సరూర్‌నగర్‌లో ఈ నెల 4న జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది. 

భర్త హత్య అనంతరం అశ్రిన్ వికారాబాద్‌ జిల్లాలోని మర్పల్లిలో భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. తనను పరామర్శించేందుకు వస్తున్న వారితో తన బాధను పంచుకుంటున్న అశ్రిన్.. నిన్న ఓ పత్రికతో మాట్లాడుతూ.. తన సోదరుడు మోబిన్ మనస్తత్వం గురించి చెప్పుకొచ్చారు. మోబిన్ కొట్టడం వల్ల నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోయాడని, ఆయన బతికి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఆడపిల్లలంటే తండ్రికి ఎంతో ఇష్టమని, ఆయనకు చెప్పే నాగరాజును పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని అన్నారు.

జైలులో ఉన్న తన సోదరుడిని కలిసి ఓ ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తే .. తన భర్తను చంపడం ద్వారా పోయిన పరువు వచ్చిందేమో అడిగి తెలుసుకుంటానని అన్నారు. ఇంటర్ నుంచే నాగరాజుతో తనకు పరిచయం ఏర్పడిందని అన్నారు. మోబిన్ చిన్నప్పటి నుంచే క్రూరంగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. నాగరాజును పెళ్లి చేసుకుంటే మోబిన్ తమను చంపేస్తాడని తల్లి కూడా తనను హెచ్చరించిందని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

More Telugu News