Beggar: గుంటూరులో ఘోరం... ఇడ్లీ ఇస్తే తినలేదని బిచ్చగాడ్ని చంపేశారు!

  • ఈ నెల 1 అర్ధరాత్రి ఘటన
  • యాచకుడికి ఇడ్లీ ఇవ్వబోయిన మహేశ్
  • నిరాకరించిన బిచ్చగాడు
  • మద్యం మత్తులో ఉన్న మహేశ్, స్నేహితులు
  • బిచ్చగాడిపై దాడి చేసి హతమార్చిన వైనం
Three friends  killed a beggar in Guntur after he rejected idly offered by them

గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాము ఇచ్చిన ఇడ్లీ తినలేదన్న కోపంతో ఓ బిచ్చగాడ్ని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ నెల 1 అర్ధరాత్రి వేళ ఓ బిచ్చగాడికి మహేశ్ అనే వ్యక్తి ఇడ్లీ ఇవ్వబోయాడు. అయితే ఆ బిచ్చగాడు ఇడ్లీ తీసుకునేందుకు నిరాకరించాడు. అప్పటికే మహేశ్, అతడి స్నేహితులు అనిల్, సతీష్ కుమార్ మద్యం మత్తులో ఉన్నారు. దాంతో, ఆ బిచ్చగాడికి వారికి మధ్య గొడవ జరిగింది. ఆపై, ముగ్గురు స్నేహితులు బైక్ పై వెళ్లిపోయారు. 

కానీ, బిచ్చగాడు తాము ఇచ్చిన ఇడ్లీ తీసుకోలేదన్న కోపంతో మళ్లీ వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు... సదరు బిచ్చగాడ్ని బైక్ పై బలవంతంగా ఎక్కించుకుని అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డు వద్దకు తీసుకెళ్లి కర్రలతో కొట్టి, తలపై రాయితో మోది చంపేశారు. కాగా, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు వివరించారు.

More Telugu News