Eid party: ఈద్ పార్టీకి వచ్చి బిర్యానీతోపాటు ఆభరణాలను మింగేసిన వ్యక్తి

  • చెన్నైలో జరిగిన ఘటన
  • మద్యం మత్తులో చోరీ
  • స్కానింగ్ తో బయట పడిన నిజం
  • ఎనెమా ఇచ్చి బయటకు తీసిన వైద్యులు
Chennai man swallows jewels along with biryani at friends Eid party items recovered

రంజాన్ పండుగకు పిలిచి ఆతిథ్యమిస్తే.. బిర్యానీ తోపాటు కనిపించిన ఆభరణాలను కూడా మింగేశాడు ఓ ఘనుడు. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. మంగళవారం రంజాన్ సందర్భంగా చెన్నైలో ఒక కుటుంబం ఈద్ పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి 32 ఏళ్ల వ్యక్తి (పార్టీ చేసుకునే వ్యక్తి స్నేహితురాలి బోయ్ ఫ్రెండ్) కూడా హాజరయ్యాడు. 

పార్టీ ముగిసి, అందరూ వెళ్లిన తర్వాత చూసుకుంటే కప్ బోర్డులో ఉంచిన వజ్రాల నెక్లెస్, బంగారం గొలుసు, డైమండ్ పెండెంట్ కనిపించలేదు. దీంతో తన స్నేహితురాలి వెంట వచ్చిన స్నేహితుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతడు విషయాన్ని బయట పెట్టాడు.

పార్టీకి వచ్చిన సందర్భంగా మద్యం సేవించిన అతడి కన్ను ఆభరణాలపై పడింది. దాంతో బిర్యానీతో కలిపి మింగేసినట్టు తెలుసుకున్నారు. వైద్యుల వద్దకు తీసుకెళ్లి స్కానింగ్ తీయగా, కడుపులోనే ఆభరణాలు ఉన్నట్టు తెలిసింది. పోలీసుల సూచన మేరకు వైద్యులు అతడికి ఎనెమా ఇచ్చారు. దాంతో రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలు కూడా బయటకు వచ్చాయి.

More Telugu News