SRH: ఢిల్లీ క్యాపిటల్స్ తో కీలక పోరు... టాస్ గెలిచిన సన్ రైజర్స్

  • పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో సన్ రైజర్స్
  • మళ్లీ టాప్-4లోకి వెళ్లేందుకు తహతహ
  • ప్లే ఆఫ్ బెర్తుల కోసం తీవ్ర పోరాటం
  • మరో మూడు మ్యాచ్ లు గెలిస్తే సన్ రైజర్స్ కు చాన్స్
SRH won the toss in crucial match with Delhi Capitals

ఐపీఎల్ టోర్నీ ముందుకు సాగే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు ఎంతో కీలకం. టోర్నీలో 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించిన సన్ రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న సన్ రైజర్స్... గత రాత్రి చెన్నైపై బెంగళూరు గెలవడంతో ఐదోస్థానానికి పడిపోయింది. 

ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్ బెర్తు కోసం కనీసం మరో 3 విజయాలు సాధించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ ను సన్ రైజర్స్ కీలకంగా భావిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో మూడు మార్పులు చేసినట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. వాషింగ్టన్ సుందర్, నటరాజన్, మార్కో జాన్సెన్ స్థానంలో శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, షాన్ అబ్బాట్ జట్టులోకి వచ్చినట్టు వివరించాడు. 

అటు, ఢిల్లీ జట్టులో నాలుగు మార్పులు చేసినట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. పృథ్వీ షా, అక్షర్ పటేల్, ముస్తాఫిజూర్ రహ్మాన్, సకారియా ఈ మ్యాచ్ లో ఆడడం లేదని, వారి స్థానంలో ఆన్రిచ్ నోర్జే, మన్ దీప్, రిపల్ పటేల్, ఖలీల్ అహ్మద్ ఆడుతున్నారని పంత్ తెలిపాడు.

More Telugu News