Jeevan Reddy: రూ. 6 కోట్లు తెచ్చానని అరవింద్ అబద్ధాలు చెపుతున్నారు: జీవన్ రెడ్డి

  • స్పైస్ బోర్డుకు రూ. 6 కోట్లు తెచ్చానని అరవింద్ చెపుతున్నారన్న జీవన్ రెడ్డి  
  • ఆయన తెచ్చిన నిధులు రూ. 2 కోట్లకు కూడా మించలేదని ఎద్దేవా 
  • కవితను ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడుతున్నారని మండిపాటు 
Jeevan Reddy fires on D Arvind

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్పైస్ బోర్డుకు రూ. 6 కోట్ల నిధులు తెచ్చానని అరవింద్ చెప్పుకుంటున్న మాటల్లో నిజం లేదని... ఆయన తెచ్చిన నిధులు రూ. 2 కోట్లకు కూడా మించలేదని విమర్శించారు. కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కోట్ల నిధులను తీసుకొచ్చారని, ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. అరవింద్ గెలిచి మూడేళ్లు అవుతున్నా నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని అన్నారు. 

అరవింద్ నోరు తెరిస్తే అన్నీ బూతులు, అబద్ధాలే మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. అరాచకాలు సృష్టించే వ్యక్తి మాదిరి తయారయ్యారని అన్నారు. పసుపు బోర్డును తెస్తానని బాండ్ పేపర్ పై రాసిన అరవింద్ ను... జీవితాంతం ఆ బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయని చెప్పారు. 

తమ ఎమ్మెల్సీ కవిత సంస్కారవంతంగా మాట్లాడితే, అరవింద్ మాత్రం ఏకవచనంతో సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. అవినీతిలో పుట్టి పెరిగిన అరవింద్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం గురించి పరుషపదజాలాన్ని ఉపయోగిస్తే అరవింద్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

More Telugu News