Duggirala: మా అమ్మను ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు: ఎంపీటీసీ కుమారుడి ఆరోప‌ణ‌

  • రేపు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక‌
  • దుగ్గిరాల 2 ఎంపీటీసీగా ఎన్నికైన ప‌ద్మావ‌తి
  • ఎంపీపీ ప‌ద‌వి కోసం రెబ‌ల్‌గా ప‌ద్మావతి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం
  • త‌న త‌ల్లికి ఏమైనా జ‌రిగితే ఎమ్మెల్యే, దుగ్గిరాల ఎస్సైల‌దే బాధ్య‌త అన్న యోగేంద‌ర్‌
ysrcp mptc son allegations on managalagiri mla alla ramakrishna reddy

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై సొంత పార్టీకి చెందిన మ‌హిళా ఎంపీటీసీ కుమారుడు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేప‌థ్యంలో దుగ్గిరాల 2 ఎంపీటీసీగా గెలిచిన త‌న త‌ల్లి ప‌ద్మావ‌తిని ఎమ్మెల్యే ఆర్కే అనుచ‌రులు అప‌హ‌రించార‌ని యోగేంద‌ర్ నాథ్ అనే యువకుడు ఆరోపిస్తున్నారు. గురువారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేపై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

దుగ్గిరాలలో మెజారిటీ ఎంపీటీసీల‌ను టీడీపీ గెలుచుకున్నా... ఎక్స్ అఫీసియో ఓట్ల‌తో ఎంపీపీ ప‌ద‌విని కైవ‌సం చేసుకునేందుకు వైసీపీ వ్యూహాలు ర‌చించింది. ఇలాంటి త‌రుణంలో ఎంపీపీ ప‌ద‌విని ఆశిస్తున్న ప‌ద్మావ‌తికి వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేదు. వేరే అభ్య‌ర్థిని ఎంపీపీగా ఎన్నిక చేసేందుకు వైసీపీ స‌న్నాహాలు పూర్తి చేసింది. దీంతో రెబ‌ల్‌గా అయినా పోటీ చేసేందుకు ప‌ద్మావ‌తి సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌లు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో ప‌ద్మావ‌తిని ఆర్కే అనుచ‌రులు త‌మ వెంట తీసుకెళ్లార‌ని ఆమె కుమారుడు యోగేంద‌ర్ నాథ్ ఆరోపిస్తున్నారు. త‌న త‌ల్లికి ఎంపీపీ ప‌ద‌విపై ఆశ లేద‌ని చెప్పిన యోగేంద‌ర్‌... త‌న త‌ల్లి ఎక్క‌డుందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. త‌న త‌ల్లికి ఏదైనా జ‌రిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్సైలే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంద‌ని యోగేంద‌ర్ నాథ్ హెచ్చ‌రించారు.

More Telugu News