Andhra Pradesh: రేపే తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు సీఎం జ‌గ‌న్‌.. టూర్ షెడ్యూల్ ఇదే

  • టాటా కేన్స‌ర్ కేర్ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌
  • శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ  
  • జ‌గ‌న‌న్న విద్యా దీవెన ల‌బ్ధిదారులు, వారి త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశం
ap cm ys jagan tour in tirupati tomorrow

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం నాడు శ్రీ బాలాజీ జిల్లా కేంద్రం తిరుపతిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ జ‌గ‌నన్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ పాల్గొంటారు. ల‌బ్ధిదారులు, వారి త‌ల్లిదండ్రుల‌తో జ‌గ‌న్ మాట్లాడ‌తారు. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

జ‌గ‌న్ తిరుప‌తి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీ ప్ర‌భుత్వం నేడు విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జ‌గ‌న్‌... 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ (శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

More Telugu News