YS Sharmila: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అవుతుందట: షర్మిల వ్యంగ్యం

  • ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల వ్యాఖ్యలు
  • వడ్ల కొనుగోళ్లపై అభినందన తీర్మానం
  • కేసీఆర్ కు సిగ్గుండాలన్న షర్మిల
  • రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్ సొంతమని విమర్శలు
Sharmila take dig at TRS and CM KCR

జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తి చూపుతున్నాడని, టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) అవుతుందని కథనాలు రావడం తెలిసిందే. దీనిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు. 

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అవుతుందట... అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ అంటూ ఎద్దేవా చేశారు. "ప్లీనరీలో మొదటగా వడ్ల కొనుగోళ్లపై అభినందన తీర్మానాన్ని ప్రవేశపెడతారట... కేసీఆర్ కు సిగ్గుండాలి. బాయిల్డ్ రైస్ పై కేంద్రానికి లేఖ రాసి, ఇప్పుడు నేనే కొంటున్నా అని తీర్మానమా?" అని షర్మిల ప్రశ్నించారు. రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్ ది అని విమర్శించారు.

"మీ భూకబ్జాల కోసం ధరణిని తీసుకువచ్చి, ఇప్పుడు రైతులపై ఫీజుల భారం మోపుతున్నారు. మరోవైపు, కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని చెబుతున్న బీజేపీ ఇంతవరకు ఆ చిట్టా బయటపెట్టనేలేదు. జైల్లో పెడతామని గప్పాలు కొట్టడం తప్ప చేసిందేమీలేదు. దీనికి కారణం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందమే. 

టీఆర్ఎస్ నేతలు గౌతమబుద్ధులట... ఏ పాపం చేయలేదట! స్వయానా టీఆర్ఎస్ నేతలే చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నా కేసీఆర్ కు కనిపించడంలేదు. ఇతర పార్టీలో గెలిచి కేసీఆర్ సంకనెక్కిన అశ్వారావుపేట ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తున్నాడు. ఒక్క డిగ్రీ కాలేజీ, బస్సు సౌకర్యం కల్పించలేదు. టీఆర్ఎస్ నేతలను ప్రజలు చెప్పులు, రాళ్లతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News