Teenmaar Mallanna: త్వరలో కొత్త పార్టీ పెడుతున్నా: తీన్మార్ మల్లన్న

  • 7,200 మంది వెలమ దొరల భరతం పడతానన్న మల్లన్న 
  • ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి 
  • 10 లక్షల మందితో హైదరాబాదులో సభ నిర్వహిస్తానన్న మల్లన్న  
Teenmaar Mallanna to start his own political party

త్వరలోనే రాజకీయ పార్టీని పెడుతున్నట్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని... రాష్ట్ర సంపదను వీరు కొల్లగొడుతున్నారని, ఆ 7,200 మంది వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మల్లన్న టీమ్ 7200 పేరుతో తాను ఉద్యమం చేస్తున్నానని అన్నారు. తాను ఏర్పాటు చేసిన ఈ టీమ్ బీజేపీ కన్నా లక్ష రెట్లు మేలని చెప్పారు. ఇకపై జీవితంలో తాను బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. 

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ టీమ్ భయపడదని చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్తానని తెలిపారు. తనపై, తన కుటుంబంపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఆస్తులను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 176 మంది చిన్నారులకు తమ టీమ్ గుండె చికిత్సలు చేయించిందని తెలిపారు.

More Telugu News