Arvind Kejriwal: గుజరాత్ పాఠశాలల పరిస్థితిలో మార్పు తీసుకురాలేకపోతే నన్ను తరిమికొట్టండి: కేజ్రీవాల్

  • ఇటీవల పంజాబ్ లో అధికారంలోకి ఆప్ 
  • గుజరాత్ పై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్
  • గుజరాత్ సీఎంకు సవాల్
Kejriwal challenges Gujarat govt

ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు గుజరాత్ పై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా పేపర్ లీక్ లలో గుజరాత్ ప్రభుత్వం వరల్డ్ రికార్డు నెలకొల్పుతోందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ కాకుండా కనీసం ఒక్క పరీక్షనైనా నిర్వహించగలరా? అంటూ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

గుజరాత్ లోని గిరిజన ప్రాబల్య ప్రాంతం బరూచ్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి నిజంగా దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్ లో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో అత్యంత విజయవంతమైన తమ ప్రభుత్వ నమూనాను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. 

గుజరాత్ లో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, పెద్ద సంఖ్యలో ఇతర పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని వివరించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఆప్ కు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. ఆప్ ఆధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుతుందని, ఒకవేళ మార్పు తీసుకురాలేకపోతే నన్ను తరిమికొట్టండి అన్నారు.

More Telugu News