Kishan Reddy: కరోనా వల్ల సినీ రంగం చాలా నష్టపోయింది: కిషన్ రెడ్డి

  • హైదరాబాదులో మేడే వేడుకలు
  • తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం
  • హాజరైన కిషన్ రెడ్డి 
  • ఈ-శ్రమ్ కార్డులు తీసుకుంటే ప్రయోజనకరమని వెల్లడి
Kishan Reddy says Cine Sector faced many problems during corona pandemic

హైదరాబాదులో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా సంక్షోభం వల్ల సినీ, పర్యాటక రంగాలు ఎంతో నష్టపోయాయని వెల్లడించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చాక సినీ, పర్యాటక రంగాలు కాస్త నిలదొక్కుకున్నాయని వివరించారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కిషన్ రెడ్డి కొనియాడారు. 

దేశంలో 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని వెల్లడించారు. 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారని తెలిపారు. సంఘటిత రంగ కార్మికులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని, అందుకే అసంఘటిత రంగ కార్మికులకు కూడా లబ్ది చేకూరేలా ప్రత్యేక చట్టం తెస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

ఈ-శ్రమ్ కార్డులు తీసుకుంటే కార్మికులకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం 29 చట్టాలను 4 చట్టాలుగా మార్చామని వివరించారు. సోషల్ సెక్యూరిటీ బోర్డు చట్టం సినీ కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

More Telugu News