Repalle Incident: రేపల్లె అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు... వివరాలు ఇవిగో!

  • రేపల్లెలో గతరాత్రి అత్యాచార ఘటన
  • ముగ్గురు నిందితుల అరెస్ట్
  • నిందితుల్లో ఒకరు బాలుడు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్న ఎస్పీ 
SP Vakul Zindal told media Repalle incident details

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన రేపల్లె అత్యాచార కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విజయకృష్ణ, నిఖిల్ అనే యువకులతో పాటు ఓ బాలుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్పీ వకుళ్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. 

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. నిందితులు టైమ్ అడిగి బాధితురాలి భర్తతో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. తన వద్ద వాచీ లేదని చెప్పడంతో అతడిని కొట్టి రూ.750 లాక్కున్నారని వెల్లడించారు. బాధితురాలిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని వివరించారు. స్థానికుల సాయంతో ఆమె భర్త రేపల్లె పోలీసులను ఆశ్రయించాడని ఎస్పీ తెలిపారు. పోలీసు జాగిలం, ఇతర మార్గాల ద్వారా ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ వకుళ్ జిందాల్ స్పష్టం చేశారు. 

కాగా, రేపల్లె అత్యాచార బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

More Telugu News