Ravindra Jadeja: ఇక నా వల్ల కాదంటూ జడేజా సంచలన నిర్ణయం... చెన్నై కెప్టెన్ గా మరోసారి ధోనీ

  • ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నైకి పరాజయాలు
  • 8 మ్యాచ్ ల్లో ఆరింట ఓడిపోయిన వైనం
  • కొత్త కెప్టెన్ జడేజాపై తీవ్ర ఒత్తిడి
  • ఇక కెప్టెన్ గా కొనసాగలేనని వెల్లడి
Ravindra Jadeja quits as Chennai Super Kings captaincy

ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల బాటలో పయనిస్తున్న నేపథ్యంలో, తాను ఇక కెప్టెన్ గా కొనసాగలేనని రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యానికి తన నిర్ణయం తెలియజేశాడు. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ ఓ ప్రకటన చేసింది. జడేజా సీఎస్కే కెప్టెన్సీని మళ్లీ ధోనికి అప్పగించేశాడు అని వెల్లడించింది. 

"తన ఆటపై మరింత దృష్టి నిలిపేందుకు వీలుగా కెప్టెన్సీ వదులుకోవాలని జడేజా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, మళ్లీ పగ్గాలు స్వీకరించాల్సిందిగా ధోనీని కోరాడు. జట్టుకు సంబంధించి విస్తృత ప్రయోజనాల నేపథ్యంలో మరోసారి నాయకత్వం వహించేందుకు ధోనీ అంగీకరించాడు" అంటూ సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది. 

ఐపీఎల్ లో 4 పర్యాయాలు టైటిల్ గెలిచిన చెన్నై జట్టుకు ఈ సీజన్ ద్వారా కొత్త కెప్టెన్ వచ్చాడు. ధోనీ కెప్టెన్ గా తప్పుకోవడంతో రవీంద్ర జడేజాను నియమించారు. అయితే, డిఫెండింగ్ చాంప్ హోదాకు తీవ్ర అవమానం కలిగించే రీతిలో చెన్నై జట్టు ఘోర పరాజయాలు చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటిదాకా 8 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు గెలిచింది రెండు మ్యాచ్ లే. ఈ నేపథ్యంలోనే జడేజాపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్టు అర్థమవుతోంది.

More Telugu News