RCB: ఐపీఎల్ లో డబుల్ హెడర్ కు వేళాయె... టాస్ ఆనవాయతీ బ్రేక్ చేసిన బెంగళూరు జట్టు

  • ఇప్పటివరకు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటున్న జట్లు
  • నేడు గుజరాత్ వర్సెస్ బెంగళూరు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
  • భారీ స్కోరుపై కన్ను
  • పటిష్టంగా ఉన్న గుజరాత్ జట్టు
RCB won the toss and elected bat first

వారాంతం కావడంతో ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తున్నారు. ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. కాగా, గుజరాత్ తో పోరు సందర్భంగా బెంగళూరు జట్టు ఆనవాయతీ బ్రేక్ చేసింది. ఈ సీజన్ లో దాదాపు ప్రతి జట్టు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే. కానీ, గుజరాత్ పై టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచింది. 

ఓ మోస్తరు స్కోరైనా సరే... ఛేజింగ్ అంటే ఒత్తిడితో కూడుకున్న విషయం. ఒత్తిడికి లోనై కుప్పకూలడం కంటే, మొదట స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని ఆర్సీబీ జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఎడమచేతివాటం ఆటగాడు లోమ్రోర్ ను తుదిజట్టులోకి తీసుకున్నట్టు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. 

అటు, గుజరాత్ టైటాన్స్ జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. యశ్ దయాళ్ గాయంతో బాధపడుతుండడంతో అతడి స్థానంలో ప్రదీప్ సాంగ్వాన్ ఆడుతున్నాడని పాండ్యా తెలిపాడు. అంతేకాదు, అభినవ్ మనోహర్ స్థానంలో సాయి సుదర్శన్ ను తీసుకున్నట్టు పేర్కొన్నాడు. 

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల ఆధారంగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్ లు ఆడి 7 విజయాలు సాధించింది. బెంగళూరు 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు నమోదు చేసింది.

More Telugu News