Botsa Satyanarayana: పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజి అవాస్తవం: మంత్రి బొత్స

  • ఏపీలో నిన్న, ఇవాళ పేపర్ లీక్ అంటూ వార్తలు
  • కొట్టిపారేసిన బొత్స
  • ఎల్లో మీడియా దుష్ప్రచారం అంటూ ఆరోపణలు
  • తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు
Minister Botsa clarifies Tenth exam papers leakage

ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని, తాజాగా హిందీ ప్రశ్నాపత్రం కూడా లీకైందని వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఇదంతా ఎల్లో మీడియా సృష్టి అని ఆరోపించారు. విద్యార్థులు ఎల్లో మీడియా వార్తలను పట్టించుకోవద్దని అన్నారు. పరీక్షలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులను మనోవేదనకు గురిచేయడం తగదని మంత్రి బొత్స హితవు పలికారు. 

రాష్ట్రంలో నిన్నటి నుంచి పరీక్షలు జరుగుతున్నాయని, నంద్యాలలోని ఓ పాఠశాలలో పరీక్ష పేపరును ఓ క్లర్క్ ఫొటో తీశాడని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఆ ఫొటో బయటికి వచ్చిందని, అది లీక్ ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు. ఈ ఘటన జరగ్గానే తాము అప్రమత్తమై తగిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఇవాళ కూడా పేపర్ లీక్ అంటూ ఓ మీడియా చానల్లో వార్తలు వస్తే, వెంటనే ఆరా తీశామని, లీక్ కాలేదన్న విషయం స్పష్టమైందని అన్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభమేంటో ఆయా పత్రికలు, చానళ్లు గ్రహించాలని హితవు పలికారు.

More Telugu News