Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు పెట్టుకోవాలనుకున్నారు.. అయితే మా హైకమాండ్ ఒప్పుకోలేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  •  ఇక్కడ ఏం సాధించారని దేశం గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ కు కోమటిరెడ్డి ప్రశ్న
  • కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ
  • తాము అధికారంలోకి వచ్చాక ధరణి వెబ్ సైట్ ఎత్తేస్తామని వ్యాఖ్య  
Komatireddy fires on KCR

దేశం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణను ఏం అభివృద్ధి చేశారని దేశం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి కేసీఆర్ అడిగారని... అయినప్పటికీ తమ అధిష్ఠానం ఒప్పుకోలేదని తెలిపారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. తన మీదున్న కక్షతోనే నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని అన్నారు. 

ధరణి వెబ్ సైట్ తో రైతులందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. 70 శాతం గ్రామాల్లో ఇంకా వడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సాధారణ విషయమేనని అన్నారు.

More Telugu News