Vijayashanti: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారు: విజ‌య‌శాంతి

  • లక్ష, రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున వసూలు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌
  • రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని వ్యాఖ్య‌
  • పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నారన్న విజ‌య‌శాంతి
vijay shanti slams kcr

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని బీజేపీ నాయ‌కురాలు విజ‌యశాంతి ఆరోప‌ణ‌లు గుప్పించారు. టీఆర్ఎస్ నేత‌లు డ‌బ్బులు తీసుకుని అన‌ర్హుల‌కు ఇళ్లు కేటాయిస్తున్నార‌ని ఆమె చెప్పారు. 

''పేదల‌కు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నరు. లక్ష, రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నరు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నరు. 

తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లను 3 నెలల కిందట ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి...గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా... గుడిసెల్లో ఉండే పేదలను కాదని, అప్పటికే ఇండ్లు ఉన్నవాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. 

ఇవి దక్కినవాళ్లలో ఇండ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు... ఎమ్మెల్యే అనుచరులున్నరు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. దీనిపై గ్రామానికి చెందిన ఎ.కొండన్న, సి.లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

చివరికి బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు... రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్, మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి ఇటీవల నోటీసులు జారీ చేసింది. ల‌బ్దిదారుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించింది.

ల‌బ్దిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం... సగం మంది అనర్హులు ఉన్నట్టు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ... పెద్ద‌పల్లి జిల్లా మంథ‌ని, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో కూడా అచ్చు గుద్దినట్టు ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగాయి. అర్హుల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ల‌బ్దిదారులు హెచ్చ‌రిస్తున్నరు'' అని విజ‌య‌శాంతి ఆరోపించారు.

More Telugu News